సాక్షి, అమరావతి : ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ అన్నంత పనీ చేసింది. అనుమానాస్పద, వివాదాస్పద ఖాతాలను తొలగిస్తామని ఇటీవల ప్రకటించిన వాట్సాప్ యాజమాన్యం టీడీపీ ఎంపీ సీఎం రమేష్కు భారీ షాక్ ఇచ్చింది. సంస్థ నిబంధనలు ఉల్లంఘించడంతో ఆయన వాట్సాప్ అకౌంట్ను రద్దు చేసింది. వాట్సాప్ ఇతర వినియోగదారుల నుంచి అందిన ఫిర్యాదులపై విచారణ అనంతరం ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. తన వాట్సాప్ అకౌంట్ పనిచేయడం లేదంటూ సీఎం రమేశ్ పంపిన లేఖకు స్పందించిన సంస్థ ఈ వివరణ ఇచ్చింది.
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో వివాదాస్పద రాజకీయ పోస్టులు, కామెంట్లపై కఠినంగా వ్యవహరించనున్నట్లు సోషల్ మీడియా సంస్థలు ఇటీవలే ప్రకటించిన విషయం తెలిసిందే. ముఖ్యంగా ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో వివిధ రాజకీయ పార్టీలు, రాజకీయ నాయకుల అకౌంట్లపై నిఘా పెట్టింది. అయితే ఇలా కీలకమైన ఎన్నికల సమయంలో కేంద్ర ప్రభుత్వం కావాలనే తనపై ఇలాంటి కుట్రలు చేస్తోందని సీఎం రమేష్ ఆరోపించారు. అయితే పొరపాటున తప్పు జరిగి వుంటే ..ఇకపై అలాంటిది జరగకుండా చూసుకుంటానని తన ఖాతాను పునరుద్ధరించాలని ఆయన వాట్సాప్ను కోరారు.